
- బద్రీనాథ్ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా విరిగిపడిన కొండచరియలు
- మృతదేహాలు ఛిద్రం కావడంతో అక్కడే అంత్యక్రియలు
పద్మారావునగర్, వెలుగు: బద్రీనాథ్ దైవ దర్శనానికి వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ యాత్రికులు అక్కడ కొండచరియల ధాటికి చనిపోయారు. గత వారం పద్మారావునగర్ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు యాత్రకు బయలుదేరారు. శనివారం ఉదయం ఉత్తరాఖండ్లో రెండు బైక్లు అద్దెకు తీసుకున్నారు. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తిరిగి వస్తుండగా చమోలీ జిల్లా కర్ణప్రయాగ–గౌచర్ మధ్యలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై సత్యనారాయణ, నిర్మల్ షాహీపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి.
పెద్దపెద్ద బండరాళ్లు పడడంతో ఆ ఇద్దరితో పాటు బైక్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇద్దరి శరీరాలు ఛిద్రమైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద నుంచి డెడ్ బాడీలను బయటకు తీశారు. హైదరాబాద్ లోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబ సభ్యులు ఫ్లైట్ లో ఆదివారం తెల్లవారుజామున హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్లారు.
అయితే సత్యనారాయణ, నిర్మల్ షాహీ మృతదేహాలు బాగా డ్యామేజ్ కావడంతో అక్కడి పోలీసు అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. వారి మరణవార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే అపార్ట్మెంట్ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, ఆయన భార్య హేమ కిరాణాకొట్టు నడుపుతోంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.