లెఫ్ట్‌ పార్టీలకు చెరో రెండు సీట్లు.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఖరారు

లెఫ్ట్‌ పార్టీలకు చెరో రెండు సీట్లు.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఖరారు
  • సీపీఎంకు మిర్యాలగూడ, వైరా.. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. సీట్లపై కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ముఖ్యనేతలు సమాచారమిచ్చారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. వీటికి సీపీఐ అంగీకారం తెలిపింది. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇచ్చేందుకు అంగీకరించారు.

అయితే సీపీఎం నేతలు చివరి వరకూ పాలేరు సీటుకోసం ప్రయత్నించినా ఫలితం తగ్గలేదు. దీంతో పాలేరు సీటుపై ఆశలు పెట్టుకున్న సీపీఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రంకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశాన్ని ఆన్​లైన్‌లో నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన సీట్లపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చెరో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు అవగాహన కుదిరినట్టు సమాచారం.