స్కాట్లాండ్​లో ట్రెక్కింగ్​కు వెళ్లి.. తెలుగు స్టూడెంట్లు మృతి

స్కాట్లాండ్​లో ట్రెక్కింగ్​కు వెళ్లి.. తెలుగు స్టూడెంట్లు మృతి
  •     ఫొటోలు తీస్తుండగా నదిలో పడిపోయిన యువకులు
  •     స్కాటిష్ జలపాతం నుంచి డెడ్​బాడీలు వెలికితీసిన అధికారులు

లండన్: స్కాట్లాండ్​లో చదువుతున్న ఇద్దరు తెలుగు స్టూడెంట్లు ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి ట్రెక్కింగ్​కు వెళ్లిన వారు ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తూ నీళ్లలో పడిపోయారని అధికారులు తెలిపారు. స్కాట్​లాండ్​లో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

ఫొటోలు తీస్తూ జారి పడి.. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన కరుకూరి జితేంద్రనాథ్(26), బొలిశెట్టి చాణక్య(22) స్కాట్​లాండ్​లోని డూండీ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంకో ఇద్దరితో కలిసి గురువారం బ్లెయిర్ అథోల్​లోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం చూసేందుకు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా జితేంద్రనాథ్, చాణక్య ఇద్దరూ నదిలో పడి కొట్టుకుపోయారు. మిగతా ఇద్దరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీస్  సిబ్బంది స్పాట్​కు చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఇద్దరి డెడ్​బాడీలను పోలీసులు వెలికితీసినట్లు లండన్​లోని ఇండియన్ హైకమిషన్ తెలిపింది. మృతదేహాలను పోస్ట్​మార్టం అనంతరం మనదేశానికి పంపించనున్నట్లు వెల్లడించింది. జితేంద్రనాథ్, చాణక్య ఇద్దరూ డూండీ వర్సిటీలో డేటా సైన్స్, ఇంజనీరింగ్​లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. జితేంద్ర గతంలో అమెరికాలోని కనెక్టికట్ వర్సిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య హైదరాబాద్​లోని జేఎన్​టీయూలో ఇంజనీరింగ్ చదివాడు. కాగా, వీళ్లిద్దరి మృతిపై డూండీ వర్సిటీ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిన్సియర్ స్టూడెంట్లను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.