న్యూఢిల్లీ: డబ్బు కోసం స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు.. చిక్కకుండా సరుకు స్మగ్లింగ్ చేయడం కోసం శరీరాన్ని కూడా సాధనంగా వాడుకుంటున్నారు. తమిళ హీరో సూర్య సినిమా ‘‘వీడొక్కడే’’లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు సరుకు కడుపులో పెట్టుకుని చేసే సీన్ ఉంటుంది.. అచ్చం అలాగే ఇప్పుడు ప్రయత్నించి ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇద్దరు స్మగ్లర్లు దొరికిపోయారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్బెకిస్థానీలను ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ శుక్రవారం రాత్రి ట్వీట్ చేసింది. నోట్లో దాదాపు కిలో బంగారం పెట్టుకుని వస్తూ దొరికిపోయారని వెల్లడించింది. పళ్లకు సెట్ రూపంలో బంగారపు చెయిన్ను అమర్చుకుని ఆ ఇద్దరు వస్తుండగా అరెస్టు చేసినట్లు పేర్కొంది.
‘‘ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆగస్టు 28వ తేదీ రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్బెకిస్థాన్ దేశస్తులను కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. పంటికి పెట్టుకునే సెట్ రూపంలో పూతపోసి 951 గ్రాముల బంగారాన్ని ఆ ఇద్దరూ నోట్లో అమర్చుకుని తీసుకొచ్చారు” అని శుక్రవారం ఢిల్లీ కస్టమ్స్ ట్వీట్ చేసింది. దీని వెనుక ఉన్న స్మగ్లింగ్ ముఠా ఎక్కడిది? ఆ బంగారం ఎవరి కోసం తీసుకెళ్తున్నారు? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
Officers of Customs AIU, IGI Airport apprehended 2 Uzbeki nationals on 28/8 night coming from Dubai in the Green Channel. On search, 951 gms gold in form of dentures and a metallic chain was recovered from their oral cavity. pic.twitter.com/E8FIw6ZqRP
— Delhi Customs (@Delhicustoms) September 10, 2021