యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 'myAadhaar' పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువును జూన్ 14, 2027 వరకు పొడిగించింది. దీనివల్ల ప్రజలు ఎటువంటి ఫీజు లేకుండా గుర్తింపు, అడ్రస్ మార్చుకోవడానికి మరో ఏడాది సమయం దొరికింది...
గతంలో ఈ గడువు 2026 జూన్తో ముగియాల్సి ఉంది. ఈ ఫ్రీ సర్వీస్ కేవలం ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే లభిస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఆధార్ తీసుకుని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా వివరాలు మార్చని వారు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
మరోవైపు, ప్రస్తుతం వాడుకలో ఉన్న 'mAadhaar' యాప్ను త్వరలోనే నిలిపివేయనున్నారు. దీని స్థానంలో కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి రానుంది. ఇందులో సురక్షితమైన క్యూఆర్ కోడ్, మెరుగైన గోప్యత, సులువైన సేవలు ఉంటాయని UIDAI తెలిపింది.
ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసే విధానం
ఆన్లైన్ ద్వారా మీ ఆధార్ను సులువుగా అప్డేట్ చేసుకోవడానికి
* మొదట myAadhaar పోర్టల్కు వెళ్లి, మీ ఆధార్ నంబర్, మొబైల్కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.
*స్క్రీన్పై కనిపించే మీ పేరు, అడ్రస్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
*వివరాలు సరిగ్గా ఉంటే, గుర్తింపు ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. ఈ ఫైల్స్ JPEG, PNG లేదా PDF ఫార్మాట్లో 2 MB కంటే తక్కువ సైజులో ఉండాలి.
*అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ను భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోండి.
ఆధార్ సెంటర్ వెళ్లాల్సి వస్తే
*కొన్ని రకాల మార్పులను ఆన్లైన్లో చేయడం కుదరదు. వాటి కోసం ఖచ్చితంగా ఆధార్ సెంటరుకి వెళ్లాల్సిందే. ఇందులో బయోమెట్రిక్ వివరాలు అంటే వేలిముద్రలు, కనుపాప స్కాన్ (Iris Scan), ఫోటో మార్చడానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇతర వివరాలు అంటే మీ పేరు, పుట్టిన తేదీ, లింగం (Gender), మొబైల్ నంబర్ మార్చడానికి కూడా ఆధార్ సెంటరులో ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం.
