
కరోనా బారిన పడి కోలుకున్న వారు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడిన రోగులు..ఆరోగ్యం మెరుగయ్యాక..వారిలో అవయవాలు దెబ్బతింటున్నాయి. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
యూకేలో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు కరోనా నుంచి కోలుకున్న వారిపై అధ్యయనం నిర్వహించారు. మొత్తం 259 మంది కరోనా బాధితులపై పరిశోధన చేశారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. లాంగ్ కోవిడ్తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించారు. కరోనా సోకని వారితో పోలిస్తే కొవిడ్ సోకిన వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు.