- క్రెమెన్చుక్ లక్ష్యంగా రష్యా ఎటాక్
- మాల్లో వెయ్యి మందికి పైగా జనం
- ప్రాణ నష్టం ఊహించలేకపోతున్నాం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మిసైల్స్తో విరుచుకుపడుతూనే ఉంది. జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేస్తోంది. సోమవారం క్రెమెన్చుక్ నగరంలోని ఓ షాపింగ్ మాల్పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఎటాక్ చేసిన సమయంలో మాల్లో సుమారు వెయ్యి మందికి పైగా ఉన్నారు. దీంతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ టెలిగ్రామ్ వేదికగా రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. షాపింగ్ మాల్పై దాడి ఊహించలేమని, మృతులు, క్షతగాత్రులు ఎంత మంది ఉంటారో కూడా చెప్పలేమని తెలిపారు.
ఓ అంచనాకు రావడం కూడా కష్టమే అని చెప్పారు. మానవతా దృక్పథంతో రష్యా వ్యవహరిస్తుందని ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ అని మండిపడ్డారు. క్రెమెన్చుక్లోని కిక్కిరిసి ఉన్న షాపింగ్మాల్పై రష్యా మిసైల్ ఎటాక్ చేసిందని మేయర్ విటలీయ్ మెలెటస్కీ ప్రకటించారు. క్రెమెన్చుక్ ఇండస్ర్టియల్ సిటీ. రష్యాతో యుద్ధానికి ముందు ఇక్కడ 2,17,000 మంది ప్రజలు నివసించేవారు. ఉక్రెయిన్లోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉంది.
రష్యా నెక్స్ట్ టార్గెట్ లుహాన్స్క్
తూర్పు లుహాన్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నిస్తోందని గవర్నర్ సెర్హి హైదాయ్ తెలిపారు. లైసిచాన్స్క్ నగరంపై దాడి ముమ్మరం చేసిందన్నారు. కీవ్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు వెస్ట్రన్ దేశాల లీడర్లు సోమవారం సమావేశం అయ్యారన్నారు. కొన్ని రోజుల కింద సీవీరోడోనెట్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు, పక్కనే ఉన్న లైసిచాన్స్క్పై కన్నేశారని తెలిపారు. మిసైల్స్, బాంబులతో విరుచుకుపడుతున్నారని సెర్హి హైదాయ్ వివరించారు.
డాన్బాస్ రీజియన్ను స్వాధీనం చేసుకోవడం రష్యా బలగాల ప్రధాన లక్ష్యమన్నారు. నగరం దక్షిణ భాగాన్ని రష్యా ఆర్మీ బ్లాక్ చేస్తోందని, రాకెట్ లాంచర్లు, ఆయుధాలు తరలించేందుకు అడ్డొచ్చిన ప్రతీ గ్రామంపై దాడికి దిగుతోందని వివరించారు. 24 గంటల్లో కీవ్తో పాటు ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా బలగాలు జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు చనిపోగా.. 31 మంది గాయపడ్డారని జెలెన్స్కీ కార్యాలయం ప్రకటించింది.