కీవ్: రాజధాని కీవ్లోని కీలకమైన ప్రాంతాన్ని మళ్లీ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. తెల్లవారుజామున కీవ్ సబర్బ్ మకరీవ్లో ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. తమ బలగాలు రష్యన్లను తరిమి కొట్టాయని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో కీలకమైన ఒక హైవేపై ఉక్రెయినియన్లకు పట్టు చిక్కింది. దీని ద్వారా రష్యా బలగాలు రాకపోకలు సాగించకుండా అడ్డుకునే అవకాశం దక్కింది. అయితే కీవ్లోని కీలక ప్రాంతాలైన బుచ్చా, హోస్టోమెల్, ఇర్పిన్ తదితర ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా రష్యన్ బలగాల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. కీవ్కు సమీపంలోని ప్రాంతాల్లోనూ రష్యా బలగాల పట్టు కొనసాగుతోంది. మరియుపోల్పై కంట్రోల్ కోసం పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ పోర్ట్ సిటీపై పట్టు సాధించేందుకు రష్యన్లు అన్ని వైపుల నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నగరంలో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. పేలుళ్లు, తుపాకీగుళ్ల శబ్ధాలే వినిపిస్తున్నాయి. బూడిద, పొగ ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. మరోవైపు కీవ్లో బుధవారం ఉదయం వరకు 35 గంటల కర్ఫ్యూ విధించారు. స్థానికులు ఇండ్లు, అండర్గ్రౌండ్లో తలదాచుకుంటున్నారు. ఇక సరెండర్ కావాలన్న డిమాండ్లకు మరియుపోల్అధికారులు అంగీకరించకపోవడంతో అక్కడ దాడుల తీవ్రతను పెంచింది రష్యన్ మిలిటరీ. రష్యన్ బలగాలు ఎక్కువగా ఎయిర్ఫోర్స్, ఆర్టిలరీలపైనే ఆధారపడుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు చేరుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్లో రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి న్యూట్రల్గా ఉంటున్న ఇండియాపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సంచలన కామెంట్లు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఇండియా భయపడుతోందన్నారు. చాలావరకు అమెరికా మిత్రదేశాలు, పక్షాలు మాత్రం పుతిన్ చొరబాటుపై చర్యల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు.
మమ్మల్ని చేర్చుకోండి.. లేదా భయమని ఒప్పుకోండి
ఉక్రెయిన్కు మద్దతు కూడగట్టే చర్యల్లో భాగంగా వివిధ దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వరుస ప్రసంగాలు ఇస్తున్నారు. మంగళవారం ఇటలీ పార్లమెంట్ లో వర్చువల్గా మాట్లాడారు. రష్యా దాడులతో మరియుపోల్ మరుభూమిగా మారిందని, రష్యాకు భయపడి నాటో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు. ఉక్రెయిన్కు వెంటనే నాటో సభ్యత్వం ఇవ్వాలని, లేదంటే రష్యా అంటే తమకు భయమని ఒప్పుకోవాలని అన్నారు. అలాకాని పక్షంలో తమకు సభ్యత్వం ఇవ్వకపోయినా తమ భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే యుద్ధానికి ముగింపు దొరుకుతుందని చెప్పారు. రష్యా బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ‘‘ఖార్కీవ్, మరియుపోల్, కీవ్ సిటీలను అప్పగించాలని వారు డిమాండ్ చేయవచ్చు. కానీ అక్కడి జనాలు వారిని రానివ్వరు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడి ప్రజలను చంపాలి. నిర్మానుష్యంగా మారిన సిటీలు వారి పరమవుతాయి”అని స్పష్టం చేశారు.
