
ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రకర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆకలి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కంటే ఒబెసిటీతో బాధపడే పిల్లల సంఖ్య ఏటికేడు పెరిగిపోతున్నది. ఇటీవల యునిసెఫ్ విడుదల చేసిన ‘‘హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ – 2025” నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18.8 కోట్ల మంది పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నట్టు తేలింది.. ఒకప్పుడు సంపన్న దేశాల సమస్యగా ఉన్న ఈ ఒబెసిటీ సమస్య ఇప్పడు మధ్య ఆదాయం కలిగిన భారత్లో కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని వైద్య నిపుణులు అంటున్నారు. ఒబెసిటీ అంటే కేవలం లావు పెరగడం మాత్రమే కాదని, అది క్రమేనా డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్లాంటి ఎన్నో భయంకరమైన రోగాలకు దారి తీస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన మరో ఐదేండ్లలో మన భవిష్యత్ భారతం రోగాలతో నిండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తోనే...
ఒబెసిటీ పెరిగిపోవడానికి ప్రధాన కారణం షుగర్, ఫ్యాట్, సాల్ట్ అధికంగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడమేనని యునిసెఫ్ రిపోర్టులో వెల్లడించింది. దేశంలో ఈ ఫుడ్ వినియోగం 2006లో 900 మిలియన్ డాలర్ల నుంచి 2019 నాటికి 37.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ప్రమాదకర ఈ ఆహారం వినియోగం పెరిగింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, టీవీల్లో ప్రకటనలు పిల్లలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వైపు వెళ్లేలా చేస్తున్నాయని యునిసెఫ్ పేర్కొన్నది. తల్లుల్లో సరైన పోషకాహారం లేకపోవడం, పిల్లలకు తగినంత తల్లిపాలు ఇవ్వకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, స్క్రీన్ సమయం పెరగడంలాంటివి కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయని రిపోర్ట్లో అభిప్రాయపడింది. యునిసెఫ్ 170 దేశాల్లో 64 వేల మందిని సర్వే చేయగా 75 శాతం మంది చక్కెర, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫాస్ట్ఫుడ్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. 60 శాతం మంది వాటిని తినాలని కోరిక పెరిగిందని చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఐదేండ్లలో 11 శాతం ఒబెసిటీ మన దగ్గరే..
మరో ఐదేండ్లలో పిల్లల్లో ఒబెసిటీ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని యునిసెఫ్ హెచ్చరించింది. 2030 నాటికి భారత్లో 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఒబెసిటీ వాటాలో 11 శాతం ఉంటుందని రిపోర్ట్లో పేర్కొన్నది. భారత్లో ఈ తీవ్రతను తెలియజేసేందుకు యునిసెఫ్.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వివరాలను పొందుపరిచింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం 2005–06 సంవత్సరంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 1.5 శాతం స్థూలకాయం సమస్య ఉండగా, 2019–21 నాటికి అది 3.4 శాతానికి చేరింది. అంటే పదిహేనేండ్ల కాలంలోనే 127 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే టీనేజీలో ఉన్న బాలికల్లో అధిక బరువు కలిగిన వారు 2.4 శాతం నుంచి 5.4 శాతానికి, బాలురలో 1.7 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగారు. బాలికల్లో 125 శాతం, బాలురల్లో ఏకంగా 288 శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇక పెద్దవారిలో ఇది 91 శాతం పెరుగుదల ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే దేశంలో సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది.