ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం

ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం
  • చందాలు వసూలు​ చేసి డ్రైనేజీ పనులు?
  • ఒక్కో ఇంటి నుంచి రూ.25 వేల చొప్పున వసూల్
  • అనుమతులు లేకుండానే పనులు
  • ఫీర్జాదిగూడ డీఈ అత్యుత్సాహం
  • ఇంత జరుగుతున్నా పైఅధికారులకు తెలియని వ్యవహారం

మేడిపల్లి, వెలుగు: మున్సిపల్​ పరిధిలో ఏదైనా  పనిచేయాలంటే ప్రభుత్వం  నుంచి నిధులు మంజూరు కావాలి. ఉన్నతాధికారులు వర్క్​ ఆర్డర్​ ఇవ్వాలి. పైఅధికారుల అనుమతి ఉండాలి. కానీ ఇవేవీ లేకుండానే ఓ అధికారి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టాడు. అందుకు కావాల్సిన నిధులను కాలనీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు పైఅధికారులకు తెలియకపోవడం గమనార్హం. 

ఫీర్జాదిగూడ మున్సిపల్​ పరిధిలోని మూడో డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీలో కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా కాలనీలోని ఇండ్ల ఓనర్ల నుంచి తలా రూ.25 వేల చొప్పున వసూలు చేసి ఈ పనులు చేపడుతున్నట్లు తెలిసింది. 

మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ అధికారి డీఈ సాయినాథ్ గౌడ్ అత్యుత్సాహంతో ఈ వ్యవహారానికి తెర లేపినట్టు సమాచారం. గతంలోనూ పలు కాలనీల్లో ఇలానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫీర్జాదిగూడ కమిషనర్​ను వివరణ కోరగా.. విచారణ జరిపి  చర్యలు తీసుకుంటామని తెలిపారు.