- బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు
- ఆర్డినెన్స్ను చట్టంగా మలిచేందుకు కేంద్రం ప్రయత్నం
- బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్
- 16వ లోక్సభ గడువు ముగియడంతో పాత బిల్లుకు చెల్లు
- ఆధార్, టీచర్ల రిజర్వేషన్ బిల్లులకు కూడా ఓకే
- జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన 6 నెలలు పొడిగింపు
- 17 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో బిల్లును రూపొందించింది. దీనికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. మొదట లోక్సభలో ప్రవేశపెట్టి.. అక్కడ ఆమోదం లభించగానే రాజ్యసభలో ప్రవేశపెడుతారు. రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టం రూపంలోకి వస్తుంది. మోడీ ఫస్ట్ టర్మ్లోనూ ట్రిపుల్ తలాక్ నిషేధిస్తూ ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజీ) బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా.. అక్కడ ఆమోదం లభించినా, ప్రతిపక్షాల అభ్యంతరాల వల్ల రాజ్యసభలో నిలిచిపోయింది. ఇటీవల 16వ లోక్సభ గడువు ముగియడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది. ఫలితంగా మళ్లీ కొత్తగా బిల్లును కేంద్రం రూపొందించాల్సి వచ్చింది.
లోక్సభ రద్దయితే వాటి కాలం చెల్లినట్లే
నిబంధనల ప్రకారం లోక్సభ రద్దయితే ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులు మనుగడలో ఉండవు. బిల్లులు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్నా లోక్సభ రద్దయితే ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దవుతాయి. మళ్లీ కొత్తగా బిల్లును రూపొందించి దాన్ని రెండు సభల్లోనూ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది.
ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం
ఆధార్ యాక్ట్–2016 కు సవరణ చేస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. మొబైల్ సిమ్కార్డుల జారీ కోసం, బ్యాంకు ఖాతాల ఓపెనింగ్ కోసం స్వచ్ఛందంగా మాత్రమే ఆధార్ను ఐడీ కార్డుగా వినియోగించుకోవాలని, బలవంతంగా తీసుకోరాదని ఇందులో పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై ఆర్డినెన్స్ తేగా ఇప్పుడు బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆర్డినెన్స్లో పేర్కొన్నట్లుగా సంస్థలపై రూ. కోటి జరిమానా, అదే పనిగా ఉల్లంఘనలు కొనసాగితే ప్రతీ రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానాలు విధించనున్నారు.
200 పాయింట్ రోస్టర్కు ఓకే
విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ నియామకం కోసం 200 పాయింట్ రోస్టర్ విధానాన్ని అమలు చేసే ‘ది సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ టీచర్స్ కేడర్) బిల్లు–2019’కు కేబినెట్ ఓకే చెప్పింది. కళాశాల లేదా యూనివర్శిటీని యూనిట్గా తీసుకుని 200 రోస్టర్ విధానాన్ని పునురుద్ధరించాలని, 13 పాయింట్ల రోస్టర్ విధానాన్ని ఎత్తివేయాలని స్టూడెంట్స్ యూనియన్స్, ఫాకల్టీ యూనియన్స్ చేస్తున్న డిమాండ్ దృష్ట్యా మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు, సెజ్ (సవరణ) బిల్లు సహా మొత్తంగా 10 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతంలో నివసించేవారికి రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
గడువులోగా చట్టంగా మలిచేందుకు..
ట్రిపుల్ తలాక్ పేరిట ముస్లిం మహిళలకు అకారణంగా విడాకులు ఇస్తున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దాన్ని రద్దు చేసేందుకు మొన్నటి ఫస్ట్ టర్మ్ పాలనలో మోడీ సర్కార్ ప్రయత్నించింది. ఇందుకోసం ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజీ) పేరిట బిల్లును తెచ్చింది. అందులో ట్రిపుల్ తలాక్ పాటించడాన్ని నేరంగా పేర్కొనడం వంటి నిబంధనలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బిల్లు రాజ్యసభలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో కేంద్రం ముస్లిం ఉమెన్ ఆర్డినెన్స్–2019ను తీసుకువచ్చింది. దీని ప్రకారం దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం. అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఏదైనా ఆర్డినెన్స్ను తీసుకువచ్చినప్పుడు చట్ట రూపం కల్పిస్తేనే మనుగడలో ఉంటుంది. లేకపోతే ఎక్స్పైరీ అవుతుంది. ఆర్డినెన్స్ తెచ్చాక జరిగే మొదటి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి 45 రోజుల్లోపు చట్టంగా మార్చాల్సి ఉంటుంది.