కేరళ కాదు.. ఇకపై కేరళం

కేరళ కాదు.. ఇకపై కేరళం
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
  • ప్రధాని కొత్త ఆఫీసులో కేబినెట్ తొలి సమావేశం
  • జ్యూట్ మద్దతు ధర క్వింటాల్‌‌‌‌ రూ.5,925కు పెంపు
  • రూ. 9,072 కోట్లతో 3 మెగా రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా
  • అహ్మదాబాద్‌‌‌‌ మెట్రో ఫేజ్‌‌‌‌-2 విస్తరణకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌
  • విద్యుత్‌‌‌‌ రంగంలో సంస్కరణలకు  ఆమోదం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నూతన కార్యాలయ సముదాయం (పీఎంవో) ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి సమావేశంలో కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ నుంచి నిర్వహిస్తున్న పాలన అంతా దేశంలోని చిట్టచివరి వ్యక్తి జీవితాన్ని సులభతరం చేసే లక్ష్యంతోనే సాగుతుందని తీర్మానించింది. ఈ ప్రాంగణంలో ‘నాగరిక్ దేవో భవ’ (పౌరుడే దేవుడు) అనే ప్రేరణతో నిర్ణయాలు తీసుకుంటామని, ఇది ప్రతి భారతీయుడి సాధికారతకు కేంద్రంగా మారుతుందని  ప్రకటించింది.  

ఇది కేవలం ఒక భవనం కాదు..నవ భారత్ పునర్నిర్మాణానికి ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపింది. సేవా తీర్థ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని సంస్కృతి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నది.  ఇది ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా భారత్ గర్వాన్ని పెంచుతుందని తీర్మానం పేర్కొన్నది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

కేరళ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ పంపిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రం పేరును మార్చాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్ 2024 జూన్ 24న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కేరళ’ అని ఉందని, దానిని ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళం’గా సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ మార్పును వర్తింపజేయాలని కోరారు.

 దీంతో ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతామని అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. ఏప్రిల్–-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్7,500 కోట్లకు పెంపు 

దేశంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ తన ఒక్కో అనుబంధ సంస్థలో చేసే ఈక్విటీ పెట్టుబడి పరిమితిని రూ.5 వేల కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచుతూ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆమోదం తెలిపింది. ‘మహారత్న’ హోదా కలిగిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే అధికారాల బదలాయింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి పరిమితి పెంచినా కంపెనీ మొత్తం నెట్ వర్త్​లో 15 శాతానికి మించకూడదనే ప్రస్తుత రూల్​ మాత్రం యథాతథంగా కొనసాగించనున్నారు.

రూ. 9,072 కోట్లతో 3 మెగా రైల్వే ప్రాజెక్టులు..

దేశీయ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 9,072 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన 3 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.ఈ ప్రాజెక్టులు ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల గుండా సాగనున్నాయి. గోండియా– - జబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, పునరఖ్– - కియుల్ మార్గంలో,  గమారియా –- చాండిల్ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3వ,  4వ లైన్ల పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా 307 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి రానున్నాయి. మల్టీ-ట్రాకింగ్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 5,407 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నదని, ఆయా ప్రాంతాల్లోని 98 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.  

కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరిన్ని కీలక నిర్ణయాలివే..

  •     2026-–27 మార్కెటింగ్ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను ముడి జనపనార (జ్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కనీస మద్దతు ధరను క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 5,925 గా నిర్ణయించారు. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది రూ. 275 పెరిగింది. దీనివల్ల  బెంగాల్, అస్సాం రైతులకు ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది.
  •     గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అహ్మదాబాద్ మెట్రో నార్త్-సౌత్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల మేర విస్తరించడానికి కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,067.35 కోట్లు.
  •     జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,677 కోట్లతో కొత్త సివిల్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.
  •     క్రిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలో సహకారం కోసం జర్మనీ, కెనడాతో  జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకోవడానికి కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. లిథియం, కోబాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ఖనిజాల అన్వేషణ, మైనింగ్,  సప్లై చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పటిష్టం చేయడం ఈ ఒప్పందాల లక్ష్యం.