
- వచ్చే ఏడాది నుంచి రూల్స్ చేంజ్
- కసరత్తు చేస్తున్న కేంద్ర విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు నిబంధనలను మరింత సరళం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు రాష్ర్టాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. దీంట్లో భాగంగా సోమవారం సౌత్ ఇండియన్ స్టేట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ చైర్మన్లతో న్యాక్ అధికారులు భేటీ అయ్యారు.
మంగళ, బుధవారాల్లో కాలేజీల ప్రిన్సిపల్స్, సీనియర్ల ప్రొఫెసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల్లో తీసుకురావాల్సిన మార్పులపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండువేలకు పైగా కాలేజీలుండగా, వాటిలో కేవలం 300 వరకూ కాలేజీలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉన్నది. న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకుంటే ఆర్థికసహాయం కూడా చేస్తామని ప్రకటించినా కాలేజీలు పెద్దగా ముందుకు రాలేదు.
ఈ క్రమంలో న్యాక్ గుర్తింపు పొందటంతో ఉన్న లోపాలను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు పడ్డారు. ప్రధానంగా అన్ని కాలేజీలు, యూనివర్సిటీలను ఒకే రకంగా చూస్తూ, పాయింట్లు ఇవ్వడం లేదు. కొన్నింటికీ గ్రేడ్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే మూడు కేటగిరీల్లో న్యాక్ అక్రిడిటేషన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. దీనికితోడు ఇక నుంచి న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీలు, న్యాక్ గుర్తింపు పొందని కాలేజీల పేర్లను ఏటా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్ పొందేలా ప్రోత్సాహం అందించాలని నిబంధనలు మార్చనున్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త గైడ్ లైన్స్ ప్రకారం న్యాక్ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది.