లఖింపూర్: మోదీ హయాంలో చైనా మన భూభాగంలో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డోక్లామ్లో కూడా వారిని తిప్పికొట్టామని చెప్పారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు అప్పటి ప్రధాని నెహ్రూ బైబై చెప్పిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేరని ఆయన విమర్శించారు.
మంగళవారం లఖింపూర్లో నిర్వహించిన ఓ ఎన్నికల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసి, చొరబాట్లను అరికట్టిందని తెలిపారు. ‘‘గతంలో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కోసం బార్డర్ తెరిచి ఉండేది.. అప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు చొరబాట్లు ఆగిపోయాయి" అని షా అన్నారు. అస్సాం రాష్ట్రానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని అమిత్ షా ఆరోపించారు.