యాదాద్రి భువనగిరి జిల్లా : ఇదివరకు ఢిల్లీలో మాత్రమే ఉండే ఎయిమ్స్ ను.. మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ సురక్ష పథకం కింద దేశంలో 9 ఎయిమ్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. శనివారం బీబీనగర్ ఎయిమ్స్ ని సందర్శించిన కిషన్ రెడ్డి.. అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిమ్స్ లో ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి? ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలను మోడీ ఆదేశాల మేరకు ఎయిమ్స్ సందర్శించి, ఇక్కడి వైద్య సిబ్బంది తో సమీక్ష చేశామని అన్నారు. నిమ్స్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామన్నారు.
ముందు 50 ఎకరాలు మాత్రమే ఎయిమ్స్ కి ఇచ్చారని, రాష్ట్ర అధికారుల తో మాట్లాడితే, ఇటీవలే 160 ఎకరాలు ఎయిమ్స్ కి అదనంగా కేటాయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ బిల్డింగ్ ని త్వరగా ఎయిమ్స్ కి అప్పగించాలని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ అనిత రామచంద్రన్ ని కోరారు.
గత ఏడాది 50 మంది విద్యార్థులుతో మెడికల్ కళాశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైందని, రెండో ఏడాదికి 63 మంది జాయిన్ అయ్యారన్నారు. ఎయిమ్స్ లో… 750 ఎయిమ్స్ మెడికల్ , 200 పారా మెడికల్, 300 పీజీ విద్యార్థులు చదువుకునేలా…, 300 సీనియర్ రెసిడెంట్స్ , 7 నుంచి 8 వందల మంది నర్సింగ్ స్టాఫ్ ఉండేలా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ఇప్పటికే 150 మంది నర్సులను నియమించామని…నిన్న నే ఫలితాలు వచ్చాయన్నారు. మూడు వారాల్లో ఓపీ బ్లాక్ ప్రారంభమవుతుందన్నారు.
ఆయుష్ కి సంబంధించిన యోగ, ప్రాణాయామ లాంటివి ఎయిమ్స్ లో ఏర్పాటు చేయనున్నామని, బ్యాంక్, పోస్ట్ ఆఫీసు, డిపార్ట్మెంటల్ స్టోర్ , వైద్య సిబ్బంది నివాస సముదాయాలు లాంటి మౌలిక వసతులు కల్పించనున్నామని తెలిపారు. నియామకాలు, పరికరాలు లాంటివి ఇంకా రావాల్సి ఉందని, ఎయిమ్స్ ని రీసెర్చ్ సెంటర్ లా తీర్చిదిద్దుతామని అన్నారు.