శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని నౌగామ్పోలీస్స్టేషన్ ఆవరణలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని.. ప్రమాదవశాత్తూ జరిగిందని స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది.
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో భాగంగా పోలీసులు ఇటీవల 350 కిలోల అమ్మోనియా నైట్రేట్ను స్వాధీనం చేసుకుని నౌగామ్పోలీస్స్టేషన్లో భద్రపర్చారని తెలిపింది. మేజిస్ట్రేట్ సమక్షంలో పేలుడు పదార్థాలను సీల్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని వివరణ ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఉగ్ర కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది. జైష్-ఎ-మహమ్మద్తో సంబంధం ఉన్న PAFF టెర్రర్ గ్రూప్ ఈ సంఘటనకు బాధ్యత వహించడాన్ని కేంద్ర హోంశాఖ ఖండించింది.
కాగా, శనివారం(నవంబర్ 15) తెల్లవారు జామున నౌగామ్పోలీస్స్టేషన్లో చోటు చేసుకున్న భారీ పేలుడులో 9 మంది మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ నేలమట్టం కాగా.. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. శనివారం (నవంబర్ 15) సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్షా జమ్మూ కశ్మీర్కు వెళ్లనున్నారు. నౌగాంలో పేలుడు ప్రదేశాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించనున్నారు.
