చొప్పదండి, వెలుగు : సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్దమొత్తంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను పరిశీలించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం పథకంలో భాగంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80 శాతానికిపైగా నాబార్డు రుణ సౌకర్యం ఉంటుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిసారి చొప్పదండిలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు.
ఈ ప్లాంట్ ద్వారా మెగావాట్ కరెంట్ను ఉత్పత్తి చేయొచ్చని, ఒక్కో యూనిట్ను రూ.3 చొప్పున చెల్లించి విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయని చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకార సంఘం రూ.40 లక్షలు వెచ్చిస్తే, మిగిలిన రూ.3.40 కోట్లను నాబార్డ్ రుణ ఇస్తోందన్నారు. వడ్డీ 4 శాతం కాగా ఈఎంఐ సక్రమంగా చెల్లిస్తే 3 శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఒక్కో సహకార సంఘం ఏటా రూ.50 లక్షలు సంపాదించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా వ్యక్తిగతంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 9 శాతం వడ్డీతో రుణం వస్తుందని, సక్రమంగా కడితే 3 శాతం మినహాయింపు ఉంటుందని చెప్పారు. అనంతరం భూపాలపట్నం గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు బైరగొని కిట్టు గౌడ్ తండ్రి ఇటీవల చనిపోవడంతో.. కుటుంబ సభ్యులను బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీడర్లతో కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సెక్రటరీ కళ్లెం తిరుపతిరెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, బత్తుల లక్ష్మీ నారాయణ, బీజేపీ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 17CPD101 – సోలార్ ప్లాంట్ను పరిశీలిస్తున్న బండి సంజయ్
