
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు రమేశ్ రాథోడ్ మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేశ్ రాథోడ్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ చాలా ఉత్సాహంగా పార్టీకోసం కష్టపడ్డారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి.. జడ్పీచైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నిరంతరం ప్రజలతో గడపడానికే ఇష్టపడే వారన్నారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే.. రమేశ్ రాథోడ్ ఇకలేడనే వార్త బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రమేశ్ రాథోడ్ కాసేపటి క్రితమే(జూన్ 29న) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులోని తన ఇంట్లో అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇచ్చోడ సమీపంలో రమేశ్ రాథోడ్ కన్నుమూశారు.