8ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది

8ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది

8ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన నడుస్తోందన్న ఆయన.. ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్ లో జరిగిన పొరపాట్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని 4 లక్షల మంది ఫిర్యాదు చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇది రూ.5 లక్షల కోట్ల అప్పులకు పెరిగిందన్న ఆయన.. ఇంకా నిధులు కావాలని డిమాండ్ చేస్తూ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. అనేక శాఖలకు, విభాగాలకు చెల్లింపులు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్న కిషన్ రెడ్డి.. రాష్ట్రానికి 80శాతం రెవెన్యూ ఇస్తున్న జీహెచ్ఎంసీ ముందు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 8ఏళ్లుగా గ్రామ పంచాయితీలకు ఎన్ని ఫండ్స్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు కేంద్రం రెడీగా ఉందని, మరి కేసీఆర్ రెడీనా అంటూ ఛాలెంజ్ విసిరారు. 

రాష్ట్రంలో యథేచ్చగా అక్రమాలు, కబ్జాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మొదటి వెన్నుపోటు దళితులకే జరిగిందన్న ఆయన.. వారికి ఇస్తానన్న మూడెకరాల భూమి, ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ చేతకానితనం, అక్రమ పాలన, అహంకార పాలనతో దాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు ప్రగతిభవన్ కూడా దాటుతలేవ్ అని సెటైర్ వేశారు. రాష్ట్రప్రభుత్వానికి అసలు విద్యావ్యవస్థపై అవగాహన ఉందా అని నిలదీశారు. గురుకులాల్లో, హాస్టళ్లలో కనీస వసతుల్లేవని ఆరోపించారు. చదువుకోవాల్సిన అమ్మాయిలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే దళితబంధు అందరికీ ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజమైన అర్హులకు దళితబంధు ఇవ్వాలని కోరారు.