రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

రాష్ట్రంలో కుటుంబ పాలనతో జనం విసిగిపోయారని అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు . కేసీఆర్ మాటలను జనం పట్టించుకోవడంలేదని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ లో వేల కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ ఓటమిపాలైందని, అయినా ఆ పార్టీ మార్పు రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని జీపీఏ చేశారా అని నిలదీశారు. 

ప్రధాని మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజకీయాల కన్నా ముందు కేసీఆర్ వైఖరిలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా తాము కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కుటుంబపాలనతో దేశం భ్రష్టుపట్టి పోతోందని విమర్శించారు. ప్రధాని మోడీ రోజు 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ నెలకు 18 గంటలు పనిచేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సటైర్ వేశారు. కేంద్రం నుండి నిధులు రాకుండానే రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.