తన మూడు నెలల జీతాన్ని ఇచ్చిన కిషన్ రెడ్డి
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయార్ధం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది
భారీ వర్షాల పర్యవసానంగా, తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. దీని వల్ల పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం, తీవ్ర ఆస్తి, పంట నష్టం కూడా సంభవించింది. హైదరాబాద్ నగరంలో వరద తీవ్రత దృష్ట్యా, బాధిత ప్రాంతాలను మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా సందర్శించి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సహాయక చర్యలను వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేస్తున్నారు. ఈ క్రమంలో వరద సహాయక చర్యలకై తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం తెలిపింది.