
రైతులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పదివేల మంది పేద రైతులు ప్రాణాలు తీసుకున్న విదర్భ నుంచి తాను వచ్చానని ఆయన అన్నారు. రైతులు చేస్తున్న సూచనలు సరైనవేనని చెప్పిన గడ్కరీ… చట్టాలు సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ‘రైతులు ముందుకొచ్చి చట్టాలను అర్థం చేసుకోవాలి. మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. వారిచ్చే విలువైన సూచనలను తప్పకుండా స్వీకరిస్తాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. కొన్ని శక్తులు రైతులను తప్పుదారి పట్టిస్తూ, ఆందోళనలను దుర్వినియోగం చేస్తున్నాయి. అన్నా హజారే ఈ ఉద్యమంలో చేరతారని నేను అనుకోవడం లేదు. రైతులకు వ్యతిరేకంగా మేం ఏం చేయలేదు. తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉంది. చర్చలు జరపకపోతే సమాచార లోపం ఏర్పడి వివాదాలకు దారితీస్తుంది. చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. భారతదేశం ప్రస్తుతం రూ. 8 లక్షల కోట్ల విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్ల విలువైన ఇథనాల్ వినియోగించాలని చూస్తోంది. ప్రస్తుతం ఇథనాల్ వినియోగం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఉంది. రూ. 2 లక్షల కోట్ల ఇథనాల్ ఎకానమీ సాధిస్తే.. రూ. 1 లక్ష కోట్లు రైతుల జేబుల్లోకే వెళ్తాయి. రానున్న రోజుల్లో విమానాలు ఇథనాల్తో తయారు చేసిన ఇంధనాన్ని వినియోగించి ఎగురుతాయి. ఆ డబ్బంతా రైతులకే వెళ్తుంది. ఇదే మా విజన్ మరియు డ్రీమ్’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
For More News..