కేంద్ర మంత్రి పర్యటనతో బీజేపీలో జోష్​

కేంద్ర మంత్రి పర్యటనతో బీజేపీలో జోష్​

కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రెండు రోజుల పర్యాటనతో మంచిర్యాల జిల్లాలోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. గురువారం రాత్రి నస్పూర్​ గెస్ట్​హౌజ్​కు చేరిన మంత్రి, శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్​చార్జిలతో, పైస్థాయి లీడర్లు, వివిధ విభాగాల బాధ్యులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించే వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

బూత్​కమిటీల అవశ్యకత, వాటిని పూర్తి చేయాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. శక్తి కేంద్రాల ఇన్​చార్జీల మీటింగ్​కు హాజరైన కేంద్ర మంత్రికి పార్టీ శ్రేణులు, మహిళలు మంగళహారులు, బాణసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. పాత మంచిర్యాల, హామాలీవాడల్లో మంత్రి స్థానికులతో మాట్లాడారు. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్​ వస్తుందంటూ పలువురు మంత్రితో మాట్లాడుతూ చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్​లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బంగారి ప్రసాద్​ అనే కార్యకర్త ఇంట్లో కేంద్ర మంత్రి భోజనం చేశారు. కార్యకర్త ఇంట్లో భోజనం చేసేందుకు వెళ్లే మార్గంలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద కేంద్ర మంత్రి కాన్వాయ్​ కొద్దిసేపు ట్రాఫిక్​లో చిక్కుకుంది.

ఏడేండ్లుగా రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రైల్వే గేటు వద్ద స్థానికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పర్యటన సందర్భంగా మంత్రికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లి లో ఏకలవ్య మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎన్​ఎస్​యూఐ లీడర్లు వినతిపత్రం అందించారు. నేషనల్​ హైవేలు 63, 363లను కలుపుతూ కొత్తగా మంచిర్యాల ముల్కల నుంచి తిమ్మాపూర్​ మీదుగా కుర్మపల్లి వరకు నిర్మించనున్న బైపాస్​ రోడ్డు తో తమ పంటపోలాలు కోల్పోవాల్సి వస్తుందని, బైపాస్​ రహదారిని జిల్లా కేంద్రం మీదుగా ఏర్పాటు చేయాలని కొత్త, పాత తిమ్మాపూర్​ గ్రామస్తులు విన్నవించారు.