మీ ఊళ్ల పేర్లు మారిస్తేమా సొంతమైతయా? : రాజ్ నాథ్ సింగ్

మీ ఊళ్ల పేర్లు మారిస్తేమా సొంతమైతయా?  : రాజ్ నాథ్ సింగ్
  • చైనాకు రాజ్ నాథ్ సింగ్​ ప్రశ్న

నమ్సాయ్: అరుణాచల్ ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ చైనా ఓ ప్రకటన రిలీజ్ చేయడంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. చైనాలోని వివిధ రాష్ట్రాల పేర్లను మారిస్తే అవి ఇండియాలో భాగమవుతాయా అని ప్రశ్నించారు. మంగళవారం అరుణాచల్ ప్రదేశ్ నమ్సాయ్​లో  జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో రాజ్ నాథ్ మాట్లాడారు. 

అరుణాచల్ ప్రదేశ్​లో 30 ప్రాంతాల పేర్లను మార్చాలన్న చైనా ఎత్తుగడ క్షేత్రస్థాయి పరిస్థితులను మార్చదని తెలిపారు. అరుణాచల్ అనేది ఇండియాలో అంతర్భాగమని చెప్పారు. ‘‘చైనాలోని వివిధ రాష్ట్రాల పేర్లను మేం మారిస్తే అవి ఇండియాలో భాగమవుతాయా అని ఆ దేశాన్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను? ఇలాంటి చర్యలతో దౌత్య సంబంధాలు క్షీణిస్తాయి. పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాము. కానీ, మా ఆత్మగౌరవానికి హాని తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే తగిన జవాబిచ్చే సత్తా ఇండియాకు ఉంది” అని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.