మాస్కో : రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూఏఈతో రష్యా సంబంధాలను పుతిన్ కొనియాడారు. ఆర్థిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ‘రష్యాకు ఎమిరేట్ కీలక భాగస్వామి’ అని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బందీలను మార్చుకునేందుకు యూఏఈ చూపిన చొరవను పుతిన్ అభినందించారు. మరోవైపు ఉక్రెయిన్తో సమస్య పరిష్కారానికి అల్-నహ్యాన్ అనుకూలంగా ఉన్నట్లు యూఏఈ అధికార వార్తా సంస్థ డబ్ల్యూఏఎం వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోకు నేరుగా విమానాలు నడిపిన ఏకైక దేశం యూఏఈ. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.