
ఒక సామాన్యుడు తన భూమి కోసం, న్యాయం కోసం సాగించిన ఒంటరి పోరాటం చరిత్రకెక్కింది. దొరకు ఎదురునిలిచి న్యాయం సాధించుకున్నా, దొర అహంకారం అతని ప్రాణం తీసింది. తన బలిదానంతో తర్వాత కాలంలో తెలంగాణ విముక్తి పోరాటానికి, సాయుధ పోరాటానికీ స్ఫూర్తినిచ్చిన ఒంటరి యోధుడు షేక్ బందగీ.–
విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలు సాగుతున్న రోజులవి. జనగామ తాలూకాలోని 60 ఊర్లు దేశ్ ముఖ్ గుప్పిట్లో ఉన్నాయి. ఈ ఇలాఖాలోని కామారెడ్డిగూడెంలో షేక్ బందగీ ఒక సామాన్య రైతు. పాలోడు ఫకీర్ అహ్మద్ తో బందగీకి భూమి పంపకంలో గొడవ ఉంది. దొర రామచంద్రారెడ్డికి ఫకీర్ అహ్మద్ అనుచరుడు కావడంతో గడీలో పంచాయితీ పెట్టించాడు. బందగీకి న్యాయంగా దక్కాల్సిన భూమి ఇవ్వకుండా ఫకీర్ అహ్మద్ కు ఎక్కువ ఇవ్వాలని దొర తీర్పిచ్చాడు. ఈ తీర్పును బందగీ ఒప్పుకోలేదు. దీన్ని సవాలు చేస్తూ 1930లో జనగామ కోర్టులో సివిల్ దావా వేశాడు. అక్కడి నుంచి కేసు హైకోర్టుకు చేరింది.
పదకొండేళ్ల పాటు బందగీ సివిల్ దావాపై వాదోపవాదాలు నడిచాయి. ఈ కాలంలో దొర నుంచి బందగీకి బెదరింపులు తప్పలేదు. కేసు వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ లు. అయినా బందగీ తలొగ్గలేదు. కేసు గెలవకుండా దొర ఎన్ని కుట్రలు చేసినా హైకోర్టు బందగీకి అనుకూల తీర్పుతో న్యాయం చేసింది. ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోవడాన్ని దొర రామచంద్రారెడ్డి భరించలేకపోయాడు. ఉన్మాదిగా మారి బందగీ హత్యకు కుట్రచేశాడు.
1941 జులై 17. హైకోర్టు తీర్పు తర్వాత కామారెడ్డిగూడెంకు వెళతున్న బందగీపై ఫకీర్ అహ్మద్ తో పాటు దేశ్ ముఖ్ గుండాలు దాడిచేశారు. గొడ్డళ్లతో నరికి, కత్తులతో పొడిచి చంపారు. చంపింది ఎవరో అందరికీ తెలుసు. కానీ సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాలేదు. దీంతో బందగీ హత్య కేసు కోర్టులో నిలబడలేదు. కానీ నేలపై పడిన బందగీ నెత్తురు సంస్థానం మొత్తాన్నీ కదిలించింది. అతని హత్య సంఘటన జనం గుండెల్ని మండించింది. 1944లో భువనగిరి ఆంధ్రమహాసభలో సాయుధపోరాటం ఆలోచనకు బందగీ బలిదానం కారణమైంది.
అన్యాయానికి కులం, మతం ఉండవని చెప్పడానికి బందగీ బలిదానమే ఒక నిదర్శనం. నిజాం రాజ్యంలో దొరల చేతిలో సామాన్యులు ఎంతగా నలిగిపోయారో బందగీ జీవితం చెబుతుంది. ఏండ్ల తరబడి పోరాడి న్యాయం సాధించుకున్నా భరించలేని దుర్మార్గమైన పరిస్థితి ఉండేది. బందగీ బలిదానాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ జనం మరిచిపోలేదు. బందగీ పోరాటాన్ని జనగామ చుట్టుపక్కల పాటలు, జానపదాలుగా చెప్పుకుంటారు. అతను చనిపోయినచోటే సమాధిని కట్టారు. ఏటా అక్కడ ఉర్సు జరుపుతారు.