కరోనా టెస్ట్ చేయించుకోలేదని ఓ వ్యక్తిపై అతడి బంధువులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిన్జోర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగించే మన్జీత్ సింగ్(23) అనే వలస కార్మికుడు .. ఈ నెల 19న ఢిల్లీ నుంచి తన స్వగ్రామం బిన్జోర్ జిల్లాలోని మలక్పూర్ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో మన్జీత్ కు జ్వర లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.
మన్జీత్ సింగ్ తన స్వగ్రామానికి చేరుకున్న తర్వాత అతని బంధువులైన కపిల్, మనోజ్ లు తరచూ అతడిని టెస్ట్ చేయించుకున్నావా..? అని అడిగేవారు. అతను కరోనా బారిన పడి ఉన్నాడన్న అనుమానంతో మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోమని ఒత్తిడి చేశారు. ఈ విషయంలో గురువారం వారి మధ్య మాట మాట పెరిగింది.ఈ క్రమంలో మనోజ్, కపిల్.. మన్జీత్పై కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో మూర్ఛపోయిన అతడిని మీరట్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలకు తీవ్రగాయమవడంతో మన్జీత్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.