- ఉన్నట్టుండి.. సిరియాపై అమెరికా దాడి
- షియా మిలిటెంట్లే టార్గెట్గా ఎటాక్
- ఒకరు చనిపోయారన్న ఇరాక్
- బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి దాడులు
బాగ్దాద్: ప్రెసిడెంట్గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా తొలిసారి సిరియాలో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ మద్దతిస్తున్న ఇరాకీ మిలిటెంట్ల గ్రూప్ హిజ్బుల్లా బ్రిగేడ్స్ స్థావరాలే లక్ష్యంగా జరిపిన దాడిలో ఒక మిలిటెంట్ చనిపోయాడని, చాలామంది గాయపడ్డారని ఇరాకీ మిలీషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. నార్తర్న్ ఇరాక్ లో ఈ నెల 15న తమ బేస్పై మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు పెంటగాన్ ప్రకటించింది. ఇరాక్, సిరియా బార్డర్ లోని బౌకమల్లో వెపన్స్తో మిలిటెంట్ల బేస్కు వెళ్తున్న ట్రక్కులపై అమెరికా దాడులు చేసినట్టు సిరియా వార్ మానిటరింగ్ గ్రూప్స్ కూడా వెల్లడించాయి. ఈ దాడిలో 22 మంది మిలిటెంట్లు చనిపోయినట్టు ప్రకటించాయి. షియా మిలిటెంట్ల బేస్పై తాము దాడులు చేసినట్టు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయ్డ్ ఆస్టిన్ గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రెసిడెంట్ బైడెన్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేసినట్టు తెలిపారు. సమయం వచ్చినప్పుడు బదులిస్తామని మిలిటెంట్లను చాలాసార్లు హెచ్చరించామని లాయ్డ్ ఆస్టిన్ గుర్తు చేశారు.