V6 News

భారత్‌పై 50% టారిఫ్స్ రద్దు చేయాలని అమెరికా చట్టసభలో తీర్మానం!

భారత్‌పై 50% టారిఫ్స్ రద్దు చేయాలని అమెరికా చట్టసభలో తీర్మానం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం వరకు సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని.. అవి అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ఇండో-యూఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

యూఎస్ చట్టసభ ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసె, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు బ్రెజిల్‌పై విధించిన ఇలాంటి అత్యవసర సుంకాలను ఉపసంహరించుకోవాలని సెనేట్‌లో కూడా ఉభయపక్షాల మద్దతుతో ప్రయత్నం జరిగింది. తాజా తీర్మానం ముఖ్యంగా ఆగస్టు 27, 2025 నుంచి అమలులోకి వచ్చిన అదనపు 25 శాతం "సెకండరీ" సుంకాలను రద్దు చేయాలని కోరుతోంది. ఇప్పటికే ఉన్న పరస్పర సుంకాలను కలుపుకొని అనేక భారతీయ ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.

నార్త్ కరోలినాకు, భారతదేశానికి మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు ఎంతగానో ఉన్నాయని కాంగ్రెస్ సభ్యురాలు రాస్ పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలను సృష్టించాయని ఆమె గుర్తుచేశారు. అయితే ట్రంప్ విధించిన "చట్టవిరుద్ధమైన సుంకాలు" ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న నార్త్ టెక్సాస్ ప్రజలపై పన్ను భారం పెంచుతున్నాయని వీసె అన్నారు. ఈ సుంకాలు ప్రతికూలమైనవని, సప్లై చైన్ దెబ్బతీస్తాయని, అమెరికన్ కార్మికులకు హాని చేస్తాయని కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. 

భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించడం వల్ల మాస్కో ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి సహకరిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్ కొన్ని నెలల కిందట సెకండరీ సుంకాలను విధించారు. ఈ ఆర్థికపరమైన ఉద్రిక్తతలు ఇరు దేశాల రక్షణ, సాంకేతికత, భౌగోళిక రాజకీయ సహకారానికి కూడా ఒక సవాలుగా మారాయి. తీర్మానం ద్వారా కాంగ్రెస్ డెమొక్రాట్‌లు ఏకపక్ష వాణిజ్య విధానాలను ప్రశ్నించడం, వాణిజ్యపరమైన అధికారాన్ని తిరిగి కాంగ్రెస్‌కు తీసుకురావాలని ప్రయత్నించడం వంటి విస్తృత లక్ష్యాలను కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు.