మున్సిపోల్స్​ తర్వాత పీసీసీ నుంచి దిగిపోత

మున్సిపోల్స్​ తర్వాత  పీసీసీ నుంచి దిగిపోత

పూర్తి టైమ్​ కోదాడ, హుజూర్‌నగర్‌కే కేటాయిస్త

హుజూర్​నగర్​లో సొంతిల్లు కట్టుకుంట

మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పీసీసీ చీఫ్‌ పదవి నుంచి దిగిపోతానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలో సొంతిల్లు కట్టుకొని, పూర్తి సమయాన్ని కోదాడ, హుజూర్‌నగర్‌కే  కేటాయిస్తానని తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.  ‘‘మొన్న హుజూర్​నగర్​ బై ఎలక్షన్​ రిజల్స్ట్​కొంత మనకు సెట్​బ్యాక్​ అయినా ఆత్మస్థైరంతో ముందుకు వెళ్లాలి. ఇప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్​గా కొంత కాలం కొనసాగి.. మున్సిపల్​ ఎన్నికలు అయిపోయినంక దిగిపోవడం జరుగుతుంది. హుజుర్​నగర్​లో కూడా అతి త్వరలో ఇల్లు మొదలుపెట్టపోతున్న. పూర్తిస్థాయిలో ఇక్కడే ఉండబోతున్న. మీరు గర్వపడే విధంగా పార్లమెంట్​ సభ్యుడిగా పనిచేస్త” అని కేడర్​తో అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేయాలని  పిలుపునిచ్చారు. జనవరి 5న రిజర్వేషన్ల ప్రకటన అనంతరం సాయంత్రం వరకు అభ్యర్థుల ఎంపిక జరిగేలా సమన్వయ కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హుజూర్​నగర్​ ప్రస్తుత ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి వంద రోజులు కూడా కాకుండానే అవినీతి మొదలుపెట్టారని ఉత్తమ్​ ఆరోపించారు. గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు, ఎల్‌ఈడీ బల్బులు, మినరల్‌ ఫండ్స్‌,  వెంచర్ల పేరిట అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మఠంపల్లి మండలంలోని అమరేశ్వరీ ఫ్యాక్టరీ వద్ద 40 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్​ నాయకురాలు పద్మావతిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసి, పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కేడర్​కు సూచించారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి