హైదరాబాద్, వెలుగు : యాసంగి సీజన్లో వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్కు గాను సుమారు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం సెక్రటేరియట్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, డిప్యూటీ కమిషనర్ కొండల్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే 5 వేల కేంద్రాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని, సాగు ఆలస్యంతో మరో 13 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదన్నారు. మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇప్పటివరకు 4.89 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లు అందుబాటులో ఉంచాలని, తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపులో ఆలస్యం జరగకుండా ఉండేందుకు సరిపడా హమాలీలను నియమించుకోవాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రాకుండా చెక్ పోస్టుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు వేగంగా జరిగేలా సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.

