- బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వకు ఓకే చెప్పండి
- చత్తీస్గఢ్ సీఎంకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్వోసీ ఇవ్వాలని చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకుని లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుతో చత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే భూములు, నివాసాలకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
గురువారం ఆయన ఢిల్లీలో విష్ణుదేవ్ సాయ్తో భేటీ అయ్యారు. పెండింగ్ అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎన్వోసీ జారీ చేయాలన్నారు. ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయడానికి చత్తీస్గఢ్కు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.9.883 కోట్లు చెల్లించామని మంత్రి ఉత్తమ్గుర్తు చేశారు.
ఎఫ్ఆర్ఎల్, హై ఫ్లడ్ లెవెల్స్కు సంబంధించిన డీజీపీఎస్ సర్వే పూర్తయిందని, లైడార్ డ్రోన్ సర్వే, క్షేత్రస్థాయి డేటా సేకరణ పురోగతిలో ఉందని ఆగస్టు 7న చత్తీస్గఢ్ నుంచి రిప్లై వచ్చిందని చెప్పారు. ఎన్వోసీ ఇస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్సులు వస్తాయన్నారు. చత్తీస్గఢ్ నుంచి ఎన్వోసీ వస్తే 46.96 టీఎంసీలు తరలించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2 కింద 4.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు వీలవుతుందన్నారు.
రామప్ప పాకాల లింక్ కెనాల్ ద్వారా ములుగులో 8 వేల ఎకరాలు, నర్సంపేటలో 22 వేల ఎకరాలకు నీళ్లతో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని స్థిరీకరించడం, తాగునీళ్లవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
