జంషెడ్పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలో ఉత్తరాఖండ్ జట్టు తొలిసారి సెమీఫైనల్ చేరుకుంది. ఆదివారం, మూడో రోజు ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 6 రన్స్ తేడాతో జార్ఖండ్పై చారిత్రక విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. 136 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ ఓ దశలో 100/2 స్కోరుతో పటిష్టంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. 30 రన్స్ వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు చేజార్చుకుని 130 రన్స్కే ఆలౌటైంది.
మయాంక్ మిశ్రా 5, అభయ్ నేగి 4 వికెట్లతో జార్ఖండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఉత్తరాఖండ్ 285/5తో ఆట కొనసాగించి తొలి ఇన్నింగ్స్లో 371 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ కునాల్ చందేలా (68), జగదీశ సుచిత్ (70), అవనీష్ సుధా (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో జార్ఖండ్ 235 రన్స్కే ఆలౌటైంది. మయాంక్ మిశ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గెలుపు బాటలో జమ్మూ కాశ్మీర్
మధ్యప్రదేశ్తో క్వార్టర్స్ మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ విజయానికి అడుగు దూరంలో ఉంది. 291 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఎంపీ జట్టు.. జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (3/23), అబిద్ ముస్తాక్ (2/19) దెబ్బకు మూడో రోజు చివరకు 87/5తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసింది. మరో మ్యాచ్లో ముంబై ఇచ్చిన 325 టార్గెట్ ఛేజింగ్లో కర్నాటక 113/2 స్కోరుతో పోరాడుతోంది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉండగా ఆ జట్టుకు ఇంకా 212 రన్స్ అవసరం. ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో బెంగాల్ పట్టు బిగించింది. సుదీప్ కుమార్ ఘరామి (216 బ్యాటింగ్) అజేయ డబుల్ సెంచరీతో విజృంభించడంతో మూడో రోజు చివరకు బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 418/6 స్కోరు చేసి 123 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర 295 రన్స్కు
ఆలౌటైంది.
