కేదార్నాథ్ ఆలయం మూసివేత

కేదార్నాథ్ ఆలయం మూసివేత

ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ముగియడంతో నేడు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలంలో ఆలయం మంచులో కూరుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూజారులు గుడి తలుపులు మూసివేశారు. ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో జై బోలో శంకర్ నినాదాలు చేస్తూ  వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు.

కేదార్నాథ్ తో పాటు ఉత్తర కాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ ఆలయం కూడా ఇవాళ మూతపడింది. వచ్చే ఆరు నెలల వరకు ఆలయం మూసి ఉంటుంది. యమునా దేవి గుడిని మధ్యాహ్నం 12.09 గంటలకు అభిజిత్ ముహూర్తంలో సర్వన్ సిద్ధి యోగం కింద మూసివేశారు. చార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు. హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో  చార్ ధామ్ లు మూసివేసి తదుపరి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.

వీటితో పాటు నవంబర్ 18 శుక్రవారం రెండవ కేదార మద్మహేశ్వర, నవంబర్ 7 న మూడవ కేదార తుంగనాథ్ గుడి మూసివేస్తారు. ఈ ఏడాది చార్ ధామ్  యాత్ర మే 3, 2022న అక్షయ తృతీయ నాడు ప్రారంభం కాగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 42 లక్షల మంది దర్శించుకున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన గర్వాల్ హిమాలయ ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన గంగోత్రి ధామ్ ఆలయాన్ని అన్నకూట్ సందర్భంగా మూసివేశారు.చలికాలంలో ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేసినప్పుడు భక్తులు ముఖ్బా గ్రామంలోని గంగామాతను ఆరాధిస్తారు.