పేటీఎం టాప్‌‌ బాస్‌‌లపై కేసు

పేటీఎం టాప్‌‌ బాస్‌‌లపై కేసు
  • క్యాష్‌ బాక్‌ పేరిటరూ.1.47 లక్షల మోసం
  • వైస్‌ ప్రెసిడెంట్‌ నంటూ కాల్‌ చేసిన కేటుగాడు
  • కస్టమర్ల డేటా లీక్‌ లో కంపెనీ పాత్ర దర్యాప్తు చేస్తామంటున్న ఘజియాబాద్‌‌ పోలీసులు

ఘజియాబాద్‌‌ :  పేటీఎం క్యాష్‌‌బాక్‌‌ల పేరిట మోసాలు బాగా పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడా, ఘజియాబాద్‌‌లలో మరింత ఎక్కువయ్యాయి. పేటీఎం క్యాష్‌‌బాక్‌‌ వస్తుందంటూ చెప్పి, ఫేక్‌‌ ఫోన్‌‌కాల్స్‌‌తో జనాలను దోపిడీ చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. ఈ నేపథ్యంలో ఒక కేటుగాడు తాను పేటీఎం వైస్‌‌ ప్రెసిడెంట్‌‌నని చెప్పుకుని ఒకరికి ఫోన్‌‌ చేసి మోసం చేశాడు. మోసపోయిన వ్యక్తి ఘజియాబాద్‌‌ పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో, పేటీఎం టాప్‌‌బాస్‌‌లపై కేసు నమోదయింది.

ఘజియాబాద్‌‌కు చెందిన రాజ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ అనే వ్యక్తి కంప్లెయింట్‌‌ మీద పేటీఎం ఫౌండర్‌‌ విజయ్‌‌ శేఖర్‌‌ శర్మ, అతని సోదరుడు, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అజయ్‌‌ శేఖర్‌‌ శర్మలతోపాటు, మరికొందరు సీనియర్‌‌ ఆఫీసర్స్‌‌పై ఐపీసీ సెక్షన్‌‌ 420 (ఛీటింగ్‌‌), ఐటీ యాక్ట్‌‌లోని 66 డీ కింద కేసును నమోదు చేశారు పోలీసులు. మోసానికి గురయిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ల ఇన్ఫర్మేషన్‌‌ ఏదైనా పేటీఎం నుంచి లీకైందా అనే విషయాన్ని దర్యాప్తు చేసేందుకే ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆయుర్వేదం మందులు అమ్మే రాజ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ ఈ మోసంలో రూ.   1.50  లక్షలు పోగొట్టుకున్నాడు. కిందటేడాది డిసెంబర్‌‌ 28 నాడు సింగ్‌‌కు ఒక ఫోన్‌‌ వచ్చింది. ఫోన్‌‌ చేసిన వ్యక్తి తనను తాను పేటీఎం వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అజయ్‌‌ శేఖర్‌‌నంటూ రాజ్‌‌కుమార్‌‌ సింగ్‌‌కు పరిచయం చేసుకున్నాడు. నాకు క్యాష్‌‌బాక్‌‌ వచ్చిందని, పేటీఎం బ్యాంక్స్‌‌ నుంచి ఒక లింక్‌‌ పంపుతానని ఆగంతకుడు చెప్పాడు. ఆ లింక్‌‌ను క్లిక్‌‌ చేయాలని చెప్పడంతో, తనకు కొంత అనుమానం కలిగిందని   ఎందుకంటే పేటీఎం ఎప్పుడూ అలా అడగలేదని పేర్కొన్నాడు.  మరింత నమ్మకం కలిగించడానికి ఆ కేటుగాడు రాజ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ పేటీఎం పాత  ట్రాన్సాక్షన్స్‌‌ వివరాలను మొత్తం చదివి వినిపించాడు. ఆ మోసగాడు చెప్పిన వివరాలలో నా మెయిల్‌‌ ఐడీ, బ్యాంక్‌‌ అకౌంట్‌‌తోపాటు, ట్రాన్సాక్షన్స్‌‌ ఇన్ఫర్మేషనూ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్‌‌ పేటీఎం ఉద్యోగులకు తప్ప మరెవరికీ తెలుసుకునే వీలుండదు కదా అనే ఉద్దేశంతో ఆ లింక్‌‌ను క్లిక్‌‌ చేశానని రాజ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ వెల్లడిస్తున్నాడు. ఇలా క్లిక్‌‌ చేశానో లేదో అకౌంట్‌‌ నుంచి రూ. 1.47 లక్షలు మాయమైందని వాపోతున్నాడు.

కస్టమర్ల డేటా బయటకు పోవడంలో పేటీఎం కంపెనీ బాధ్యత ఏమైనా ఉందా అనేది దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌‌లైన్‌‌ పేమెంట్‌‌ సిస్టమ్స్‌‌ వాడే వాళ్లకు ఇదొక పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. కస్టమర్ల డేటా తీసుకునే కంపెనీలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఉండాలని ఘజియాబాద్‌‌ పోలీస్‌‌ చీఫ్‌‌ కళానిధి నైథని  కామెంట్‌‌ చేశారు. ఐతే, అలాంటి ఫోన్‌‌ కాల్‌‌ తానేప్పుడూ చేయలేదని పేటీఎం వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అజయ్‌‌ శేఖర్‌‌ శర్మ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అబద్దమని చెప్పారు. డేటా ఎలా లీకైందనేది దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు. పోలీసు దర్యాప్తులో నిజాలన్నీ బయటపడతాయని అన్నారు. తామెప్పుడూ కస్టమర్ల కేవైసీ (నో యువర్‌‌ కస్టమర్‌‌) వివరాల కోసం కాల్స్‌‌ చేయమని మరోవైపు పేటీఎం బ్యాంక్‌‌ వివరణ ఇచ్చుకుంది.