- మూడు డోసులు.. ఒక్కో డోసుకు 28 రోజుల గ్యాప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్న పిల్లలకూ కరోనా వ్యాక్సినేషన్ అక్టోబర్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఇటీవలే అనుమతించిన జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఈ నెల చివర్లో మార్కెట్లోకి వస్తుండగా అక్టోబర్లో మన రాష్ట్రానికి డోసులు వచ్చే అవకాశం ఉందని స్టేట్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని జైడస్ ఇదివరకే ప్రకటించింది. ప్రతి డోసుకూ మధ్య 28 రోజుల గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. 12 ఏండ్లు దాటిన వాళ్లెవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఉత్పత్తి తక్కువగా ఉన్నందున 12 నుంచి 18 ఏండ్ల వయసు వాళ్లకే ఇచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు 48 లక్షల మంది ఉన్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. సూది గుచ్చకుండానే నీడిల్ లేని పరికరాలతో చిన్నారులకు ఈ వ్యాక్సిన్ను వేయనున్నారు.