సెకండ్ ఫేజ్‌‌లో మోడీకి టీకా!

సెకండ్ ఫేజ్‌‌లో మోడీకి టీకా!

సీఎంలు, 50 ఏండ్లు పైబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెకండ్ ఫేజ్ లో కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. అదే ఫేజ్ లో అన్ని రాష్ట్రాల సీఎంలు, 50 ఏండ్లు పైబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా టీకా ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఏ తేదీలలో ప్రధాని, సీఎంలు వ్యాక్సిన్ తీసుకుంటారనేది చెప్పలేదు. మరోవైపు ప్రధాని కొవిషీల్డ్ తీసుకుంటారా? లేక కొవాగ్జిన్ వేసుకుంటారా? అనే దానిపై క్లారిటీ లేదు. ‘‘ఇదేం కొత్త ప్లాన్ కాదు. సెకండ్ ఫేజ్ లో రాజకీయ నాయకులకు టీకా ఇస్తామని ప్రధాని ముందే చెప్పారు” అని ఓ ఆఫీసర్ చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు సీఎంలతో మీటింగ్ నిర్వహించిన మోడీ.. సెకండ్ ఫేజ్​ వరకు ఆగాలని సూచించారు. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, ఫస్ట్ ఫేజ్ లో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్న కేంద్రం… సెకండ్ ఫేజ్​లో 50 ఏండ్లు పైబడిన వాళ్లు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 7.86 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

వ్యాక్సిన్​ తీసుకున్నోళ్లతో మాట్లాడనున్న మోడీ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు, వ్యాక్సినేటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. వారణాసి నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన ఇంటరాక్ట్ అవుతారు.