నా కొడుకు, కోడలు హత్య  వెనుక పుట్ట మధు ఉన్నడు

నా కొడుకు, కోడలు హత్య  వెనుక పుట్ట మధు ఉన్నడు
  • వామన్​రావు తండ్రి కిషన్​రావు ఆరోపణ
  • ఊరిలో మాకు ఎలాంటి కక్షలు లేవు, శత్రువులు లేరు
  • సుపారీ ఇచ్చి హత్యలు చేయించి ఇప్పుడు గ్రామ కక్షలు అంటున్నరని వెల్లడి
  • నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లి  సీన్​ రీ కన్​స్ట్రక్షన్​ చేసిన పోలీసులు
  • రాత్రి 11 గంటల తర్వాత మంథని కోర్టుకు తరలింపు.. 14 రోజుల రిమాండ్
  • రోజంతా పోలీసుల హైడ్రామా

పెద్దపల్లి, వెలుగు: హైకోర్టు లాయర్​ దంపతులు వామన్​ రావు, నాగమణి హత్య వెనుక పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు హస్తం ఉందని వామన్​రావు తండ్రి కిషన్​ రావు  ఆరోపించారు. ‘‘రాజకీయ కక్షలతోనే టీఆర్​ఎస్​ లీడర్లు ఈ హత్యలు చేసి గ్రామ కక్షలుగా నమ్మిస్తున్నారు. ఊరిలో మాకు ఎలాంటి కక్షలు లేవు. శత్రువులు లేరు. సుపారీ ఇచ్చి హత్యలు చేయించి ఇప్పుడు గ్రామ కక్షలు అని చెప్తున్నారు’’ అని మండిపడ్డారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కిషన్​రావు మీడియాతో మాట్లాడారు. తాను కొడుకు, కోడలు చనిపోయిన బాధలో ఉండటంతో మొదట పోలీసులు ఎట్ల చెప్తే అట్ల ఫిర్యాదు రాసిచ్చానన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే గమనించానని, లాయర్ల ద్వారా పోలీస్​స్టేషన్​కు వెళ్లి మళ్లీ స్టేట్​మెంట్​ ఇస్తానని తెలిపారు. తన కొడుకుని, కోడలిని చంపింది ముమ్మాటికీ టీఆర్​ఎస్​ లీడర్లేనని, రెండు హత్యలకు ప్రధాన కారణం పెద్దపల్లి జిల్లా పరిషత్​ చైర్మన్​ పుట్ట  మధు అని అన్నారు. హత్యల్లో పుట్ట మధు ప్రత్యక్షంగా పాల్గొనకున్నా పరోక్షంగా ఈ వ్యవహారమంతా నడిపించారని ఆయన పేర్కొన్నారు. కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

గేమ్​ ప్లానర్​ ఎవరో తేలాల్సిందే: బీజేపీ లీగల్​ సెల్​

లాయర్ల హత్య కేసులో డమ్మీలను ముందు పెట్టి కేసును పక్కదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతోందని బీజేపీ లీగల్​ సెల్​ సభ్యులు ఆరోపించారు. ఈ మర్డర్లలో రాజకీయ కోణం ఉన్నట్లు తాము భావిస్తున్నామని, గేమ్​ ప్లానర్​ ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. లాయర్లు వామన్​ రావు, నాగమణి కుటుంబసభ్యులను బీజేపీ లీగల్ సెల్​ సభ్యులు శుక్రవారం మంథని మండలం గుంజపడుగులో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఆదేశాల మేరకు వామన్​రావు కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికి తాము వచ్చినట్లు చెప్పారు. ఎవరికి  అన్యాయం జరిగినా వామన్​ రావు దంపతులు కోర్టులో పిల్ వేసేవారని, వాటిని న్యాయపరంగా ఎదుర్కోలేకే ఇలా వారిని చంపేశారని అన్నారు. వామన్​రావు కుటుంబం తరఫున కోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ టీమ్​లో రంగారెడ్డి జిల్లా లాయర్​ పీఠం ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ ఈసీ మెంబర్, సీనియర్ లాయర్​ కోమల ఆంజనేయులు, కరీంనగర్ బార్ ఈసీ మెంబర్ సుగుర్తి జగదీశ్వరచారి, మహిళా ప్రతినిధి తిరుమల దేవితోపాటు భాస్కర్, అమరేందర్, ఆలే నర్సింగం, రాధాకృష్ణ. మహేశ్​ తదితరులు ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ

లాయర్లు వామన్‌‌రావు దంపతులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్‌‌ కాంగ్రెస్‌‌ డిమాండ్ చేసింది. శుక్రవారం యూత్‌‌ కాంగ్రెస్‌‌ గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్‌‌ కాంగ్రెస్‌‌ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టపగలే లాయర్ల హత్య రౌడీయిజానికి, గూండాయిజానికి పరాకాష్ట అని మండిపడ్డారు. హత్యకేసులో అసలు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఈ కేసులో మండల అధ్యక్షుడిని మాత్రమే అరెస్టు చేసి తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

పోలీసుల అదుపులో బిట్టు శ్రీను

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు మంథనిలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. వామన్​రావు, నాగమణి హత్య కేసులో నిందితులైన కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్​కు బిట్టు శ్రీను తన కారు ఇచ్చినట్లు తేలింది. ఆ కారులోనే కుంట శ్రీనివాస్​, చిరంజీవి, కుమార్​ వెళ్లి లాయర్​ దంపతులను హత్య  చేశారని పోలీసులు తెలిపారు. పుట్ట మధు తన తల్లి పుట్ట లింగమ్మ పేరుతో నిర్వహిస్తున్న ‘పుట్ట లింగమ్మ చారిటబుల్​ ట్రస్ట్​’కు బిట్టు శ్రీను చైర్మన్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రస్ట్​ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు ఫండ్స్​ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని గతంలో వామన్​ రావు  హైకోర్టులో పిల్​ వేశారు.

For More News..

కరోనా మళ్లీ వస్తోంది.. వదిలేస్తే సెకండ్​వేవ్​