- కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మూసాపేట్ స్కూల్ డెవలప్మెంట్
- కొత్త క్లాస్ రూమ్తో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం
- వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, దేవర్ష్ ఫౌండేషన్ స్థాపకురాలు ఢిల్లీశ్వరి, సినీ నటుడు జగపతిబాబు హాజరు
కూకట్పల్లి, వెలుగు: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వంశీరామ్ బిల్డర్స్.. దేవర్ష్ సంస్థతో కలిసి హైదరాబాద్లోని మూసాపేట ప్రభుత్వ బాలుర స్కూల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా స్కూల్లో ఓ కొత్త క్లాస్ రూమ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం స్కూల్ ఆవరణలో చేపట్టిన కార్యక్రమంలో వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, దేవర్ష్ ఫౌండేషన్ స్థాపకురాలు ఢిల్లీశ్వరితో కలిసి కొత్త క్లాస్ రూమ్ను, పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటుడు జగపతిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు కామన్సెన్స్తో వ్యవహరిస్తే జీవితంలో ఎంతటి విజయాలనైనా సాధించి, ప్రపంచాన్ని గెలవవచ్చని పేర్కొన్నారు. స్కూల్లోని 450 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా కేవలం 50 రోజుల్లోనే వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి స్కూల్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు. విద్యాభివృద్ధి కోసం వంశీరామ్ బిల్డర్స్ సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు డ్రగ్స్తో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి: సుబ్బారెడ్డి
వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగపతిబాబు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఫౌండేషన్కు హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షత వహించడం, ఢిల్లీశ్వరి ముందుండి నడిపిస్తూ పిల్లల కోసం చేసిన ఈ కార్యక్రమంలో తనను భాగం చేయడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్లోని పిల్లలందరూ బాగా చదువుకొని, గొప్పవారు కావాలని ఆయన ఆకాంక్షించారు.
