
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో స్వర్ణముఖి నది ఉంది. ఈ నది ఒడ్డున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నిత్యం పూజలు కూడా జరుగుతుంటాయి. 2025, జూన్ 10వ తేదీ అర్థరాత్రి కొంత మంది వ్యక్తులు.. ఈ ఆలయాన్ని పూర్తి నేల మట్టం చేశారు. రాత్రికి రాత్రి ఆలయాన్ని కూల్చేసి.. గర్భ గుడిలోని వారాహి అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉన్న నడిలో పడేశారు. అర్థరాత్రి జేసీబీలతో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
కొన్ని రోజులుగా ఆలయం ఉన్న స్థలంపై వివాదం నడుస్తుంది. వివాదం నడుస్తున్న సమయంలోనూ.. ఆలయాన్ని నేల మట్టం చేయటం.. ఆలయం ఆనవాళ్లు లేకుండా చేయటం అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేయటంపై హిందూ సంఘాలు, సనాతన ధర్మం వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలంపై వివాదం ఉంటే పరిష్కరించుకోవాలి.. ఆలయాన్ని కూల్చేయటం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నేల మట్టం చేయటాన్ని నిరసిస్తూ.. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ధర్నాకు దిగారు బాధితులు, హిందూ సంఘాల వ్యక్తులు. ఇదే సమయంలో తిరుపతిలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు కంప్లయింట్ చేయటానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.
స్థలం విషయంలో ఎన్ని గొడవలు ఉన్నా.. ఇలా ఆలయాన్ని కూల్చేయటం.. అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు చేసి నదిలో పడేయటంపై విమర్శలు వస్తున్నాయి.