హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్.. అదే విధంగా పల్లెటూరి పుల్లట్లు హోటల్.. వీళ్లు అమ్మేది టిఫిన్స్ కాదు.. డ్రగ్స్. టిఫిన్ సెంటర్ మాటున.. డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు వీళ్లు. గోవా నుంచి హైదరాబాద్ సిటీకి కొకైన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్ల లీడర్ ఎవరో తెలుసా.. ఓ లేడీ.. ఈమె ద్వారా ఈ రెండు హోటళ్ల యజమానులు సిటీలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
సిటీలో పేరొందిన వ్యక్తులు
గోవా నుంచి నగరానికి అక్రమంగా కొకైన్, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్ అయింది. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి, అతని సహాయకుడు పల్లెటూరు పుల్లట్లు యజమాని వెంకట శివ సాయికుమార్ పోలీసులు సోమవారం(సెప్టెంబర్ 11) అరెస్టు చేశారు. 14 లక్షల విలువైన అక్రమ డ్రగ్స్, రూ.97,500 నగదుతో పాటు మూడు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితురాలైన అనురాధను గోవాలో కొన్నేళ్లుగా డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది. డబ్బు సంపాదించడానికి, ఆమె ప్రజా రవాణా ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ను రవాణా చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో స్థానిక ఆహార పరిశ్రమలో పేరొందిన ప్రభాకర్ రెడ్డి, వెంకట్ లతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
గోవా నుంచి..
అనూరాధను హైదరాబాద్ నుంచి విమానంలో గోవాకు వెళ్లేది. అక్కడ జేమ్స్ను కలిసి, వివిధ రకాల డ్రగ్స్ తీసుకొని బస్సు మార్గంలో గోవా నుంచి వచ్చేటప్పుడు, రెండు మూడు నగరాల్లో బస్సు దిగి, వేరే బస్సులు ఎక్కుతూ చాకచక్యంగా నగరానికి చేరుకునేది. గోవా నుంచి తెచ్చిన డ్రగ్స్ను ప్రభాకర్రెడ్డికి అందజేసేది. అతడి నుంచి 15 మంది డ్రగ్స్ను కొనుగోలు చేసి వినియోగించేవారని పోలీసులు తెలిపారు.
ఆమె గోవాలోని గుర్తుతెలియని మూలం నుండి కొకైన్, MDMA, ఎక్స్టాసీ మాత్రలు, స్ఫటికాలను ప్రభాకర్రెడ్డికి అందించేదని.. అక్రమ సరుకును విభజించడానికి నిందితులు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో కలుసుకునే వారని వెల్లడించారు. ఒప్పందం సమయంలో ఆమె మొబైల్ ఫోన్ సంభాషణలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తుందని తెలిపారు.
ఈ కేసులో ఇతర వినియోగదారులను గుర్తించేందుకు పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అనురాధ గోవాకు వెళ్లిన తర్వాత ఎక్కడ ఉండేదనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.