
షాద్నగర్, వెలుగు: మార్పు కోసం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. కొందుర్గ్ మండలం ముట్పూర్, రామచంద్రాపూర్, పులుసుమామిడి, పర్వతాపూర్, బైరాంపల్లి, మహదేవ్ పూర్ గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా షాద్ నగర్లో బీఆర్ఎస్ పాలన చూసి జనం విసిగిపోయారన్నారు.
కాంగ్రెస్ నేతలు ఏ గ్రామానికి వెళ్లినా.. జనం తండోపతండాలుగా వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హామీల అమలులో ఫెయిలైందన్నారు. కుటుంబ రాజకీయాలు చేస్తూ.. స్కామ్లకు పాల్పడుతూ, నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వీర్లపల్లి శంకర్ కోరారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మహ్మద్ ఇబ్రహీం, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.