సెర్ప్కు 25 ఏండ్లు పూర్తి 2000లో ‘వెలుగు’ ప్రాజెక్టుగా ప్రారంభం

 సెర్ప్కు 25 ఏండ్లు పూర్తి 2000లో ‘వెలుగు’ ప్రాజెక్టుగా ప్రారంభం
  • ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్​ జిల్లా మారుమూల ప్రాంతంలో అమలు

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ప్రారంభమైన ‘వెలుగు’ ప్రాజెక్టు సోమవారంతో 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది. 2000 సంవత్సరంలో ‘వెలుగు’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌‌‌‌  జిల్లా ఉట్నూరు మండలంలోని మారుమూల ప్రాంతంలో ‘వెలుగు’ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 

గ్రామీణ మహిళలను స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధించడం, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాలక్రమంలో  వెలుగును సొసైటీ ఫర్‌‌‌‌  ఎలిమినేషన్‌‌‌‌  ఆఫ్  రూరల్‌‌‌‌ పావర్టీ (సెర్ప్) గా మార్చారు. అప్పటి నుంచి లక్షల మంది మహిళల జీవితాలను ఈ ప్రోగ్రాం సాధికారత దిశగా నడిపిస్తోంది. 

డ్వాక్రాతో సెర్ప్​కు బీజం

1983లో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌  ఆఫ్‌‌‌‌  విమెన్‌‌‌‌  అండ్‌‌‌‌  చిల్డ్రన్‌‌‌‌  ఇన్‌‌‌‌  రూరల్‌‌‌‌  ఏరియాస్‌‌‌‌ (డ్వాక్రా) సంఘాల ఏర్పాటుతో సెర్ప్‌‌‌‌ కు బీజం పడింది. గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు మహిళలకు చిన్న మొత్తంలో రుణాలు, శిక్షణ, జీవనోపాధి అవకాశాలను అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. మహిళలకు ఆర్థిక చేయూతను అందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సందర్భంగా సెర్ప్‌‌‌‌  ఉద్యోగులు, మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ లో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్​ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.