ముషీరాబాద్, వెలుగు : హాస్టల్స్ స్టూడెంట్లకు మెస్ బకాయిలు చెల్లించకపోవడంతో సరైన ఆహారం అందడం లేదని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో ఆదివారం నిర్వహించిన హాస్టల్ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హాస్టల్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్లకు నాణ్యమైన ఆహారం అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులతో పాటు హాస్టల్ అద్దె, కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో బిల్డింగ్స్ ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ స్టూడెంట్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బకాయిలు రిలీజ్ చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.