కరోనా నుంచి కోలుకున్న ఉప రాష్ట్రపతి

కరోనా నుంచి కోలుకున్న ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం ఆయనకు టెస్ట్ చేయగా.. నెగటివ్ వచ్చిందని వైస్ ప్రెసిండెంట్ ఆఫీస్ వెల్లడించింది. ఆయనకు సెప్టెంబర్ 29న కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

71 ఏళ్ల వయసున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ సింప్టమ్స్ ఏవీ లేకపోవడంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 14 రోజులు పూర్తి కావడంతో ఎయిమ్స్ డాక్టర్లు సోమవారం ఉదయం వెంకయ్య నాయుడితో పాటు ఆయన భార్య ఉషా నాయుడికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టు చేశారు. వారిద్దరికీ నెగటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వెంకయ్య నాయుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అందులో తెలిపింది. డాక్టర్ల సలహా తీసుకుని త్వరలోనే ఆయన తన రెగ్యులర్ పనుల్లోకి వచ్చేస్తారని చెప్పింది. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఉప రాష్ట్రపతి థ్యాంక్స్ చెప్పారు.