డిజిటల్ గోల్డ్ కొనడం ఈజీ

డిజిటల్ గోల్డ్ కొనడం ఈజీ
  • భద్రతకు ఢోకా ఉండదు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: మనదేశంలో డిజిటల్ గోల్డ్‌‌ అమ్మకాలు  కొత్తేమీ కాదు. అయితే స్మార్ట్​ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడంతో డిజిటల్ బంగారానికి గిరాకీ పెరుగుతోంది.  ఫెస్టివల్‌‌ సీజన్‌‌ కావడంతో డిజిటల్‌‌ బంగారాన్ని మర్చంట్లు రూ. 100కు కూడా అమ్ముతున్నారు. డిజిటలేజేషన్‌‌ పెరగడంతో దీనికి డిమాండ్ ఎక్కువ అవుతోందని అంటున్నారు. టాటా గ్రూప్  తనిష్క్, కళ్యాణ్ జ్యూయలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యూయలర్ లిమిటెడ్ వంటివి తమ వెబ్‌‌సైట్లలో నేరుగా లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌‌ఫారమ్‌‌లతో చేతులు కలపడం ద్వారా ఈ బిజినెస్‌‌ చేస్తున్నాయి.

డిజిటల్ గోల్డ్‌‌ అంటే ?
సింపుల్‌‌గా చెప్పాలంటే డిజిటల్ గోల్డ్‌‌ అంకెల రూపంలో కనిపిస్తుంది. మీరు పది గ్రాములు కొంటే ఆన్‌‌లైన్‌‌లో అదే సంఖ్య కనిపిస్తుంది. భౌతికమైన రూపంలో ఉండదు. దీనిని ఆన్‌‌లైన్‌‌లో కొనుగోలు చేయడం ఈజీ. కస్టమర్ కొన్న డిజిటల్‌‌ గోల్డ్‌‌ మర్చంట్​ బీమా చేసిన వాల్ట్‌‌లలో స్టోర్‌‌ అయి ఉంటుంది. ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్ ఉంటే  గోల్డ్‌‌లో డిజిటల్‌‌గా ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.

మరికొన్ని ముఖ్య విషయాలు
మామాలూ గోల్డ్‌‌ మాదిరి కాకుండా, ఇది వర్చువల్‌‌ రూపంలో ఉంటుంది కాబట్టి చోరీ చేయడం సాధ్యం కాదు. ఖరీదైన లాకర్ ఫీజుల గురించి ఆందోళన అవసరం లేదు. ఎక్కడికీ వెళ్లకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌‌ఫోన్‌‌/కంప్యూటర్‌‌ ద్వారా సంబంధిత వెబ్‌‌సైట్‌‌/యాప్‌‌ నుంచి డిజిటల్‌‌ గోల్డ్‌‌ అమ్మితే నేరుగా డబ్బు మీ ఖాతాలో పడుతుంది.  డిజిటల్ బంగారాన్ని  స్టోర్ లేదా  వెబ్‌‌సైట్‌‌లో ఎప్పుడైనా ఆభరణాల రూపంలోకి మార్చుకోవచ్చు. ఏవైనా నగలు చేయించుకోవచ్చు.  డిజిటల్ గోల్డ్‌‌ కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీరు మీ బడ్జెట్ ఆధారంగా కొనుగోలు చేయవచ్చు. రూ.100 తోనూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని టాటా గ్రూప్ కు చెందిన జ్యూయలరీ కంపెనీ తనిష్క్ అంటోంది. మనదేశంలో ఆగ్మాంట్ గోల్డ్, ఎంఎంటీసీపీ ఏఎంపీ ఇండియా డిజిటల్ గోల్డ్‌‌ను అమ్ముతాయి. అమెజాన్‌‌, పేటీఎం, ఫోన్‌‌పే, అప్‌‌స్టాక్స్‌, గూగుల్‌‌ పే వంటి ఎన్నో ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు, టాటా గ్రూప్  తనిష్క్  వంటి జ్యూయలర్లు వీటితో ఒప్పందాలు చేసుకొని డిజిటల్ గోల్డ్‌‌ అమ్ముతున్నాయి.

ఇంతకీ దీనిని ఎలా కొనాలో చూద్దాం.
1) ముందుగా సంబంధిత యాప్‌‌/వెబ్‌‌సైట్‌‌లో రిజిస్టర్‌‌ చేసుకోవాలి.  ఐడీ, పాస్‌‌వర్డ్‌‌ ఇది వరకే ఉంటే లాగిన్‌‌ కావాలి. 
2)  డిజిటల్​ గోల్డ్​ ఖాతాను తెరిచేందుకు ఎలక్ట్రానిక్ కేవైసీని పూర్తి చేయాలి.
3)  రూపాయల్లో లేదా గ్రాముల్లో డిజిటల్‌‌ బంగారాన్ని కొనొచ్చు. మీకు నచ్చిన విధానాన్ని సెలెక్ట్‌‌ చేసుకోవాలి.
4) ఇప్పుడు పేమెంట్‌‌ విధానం ఎంచుకోండి. బ్యాంకుఖాతా, క్రెడిట్‌‌, డెబిట్‌‌కార్డ్ లేదా వాలెట్ వంటి వాటి ద్వారా డబ్బు కట్టవచ్చు. 
 

లాభాలు:
డిజిటల్ గోల్డ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ పీరియడ్‌‌ పూర్తికాగానే ఫిజికల్‌‌ గోల్డ్​ను డెలివరీ తీసుకోవచ్చు.  ఈ బంగారాన్ని పరిమాణాన్ని బట్టి నాణేలు లేదా కడ్డీల రూపంలో ఇస్తారు.  మేకింగ్ , డెలివరీ ఛార్జీలు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ వద్దని అనుకుంటే ఆన్‌‌లైన్‌‌లో అమ్మేసి డబ్బు తీసుకోవచ్చు. 
నష్టాలు:
డిజిటల్ గోల్డ్‌‌ను కొనుగోలు చేసినప్పుడు, మామూలు బంగారాన్ని కొనుగోలు చేసినట్లే , కొనుగోలు విలువపై మూడు శాతం జీఎస్టీ  చెల్లించాల్సి ఉంటుంది.  డిజిటల్ గోల్డ్‌‌ అమ్మకాలను  ఆర్‌‌బీఐ  వంటి రెగ్యులేటరీ ఏజెన్సీలు కంట్రోల్‌‌ చేయడం లేదు. ఏదైనా మోసం జరిగితే ఇబ్బందులు ఉండొచ్చు. 

భారీగా తగ్గిన ధరలు
బంగారం ధరలు విపరీతంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత ధరలు ఆరు నెలల కనిష్టానికి చేరాయి. తాజాగా శుక్రవారం కూడా ఎంసీఎక్స్‌‌లో వీటి ధరలు 0.05 శాతం తగ్గాయి. దీంతో పది గ్రాములు ధర రూ.46,500లకు పడిపోయింది. గురువారం ధరతో పోలిస్తే గ్రాముకు రూ.21 తగ్గింది. గత నెల నాలుగుశాతం, ఆగస్టులో 2.1 శాతం తగ్గాయి. ఇక నుంచి కూడా రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువని, రూ.45,500లకు పడిపోవచ్చని కమోడిటీ ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లో ఔన్సు (దాదాపు 28.35 గ్రాములు) బంగారం 1750 డాలర్ల (దాదాపు రూ.1.30 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. డాలర్‌‌ బలంగా ఉండటం వల్ల పసిడికి డిమాండ్‌‌ తగ్గుతోంది. క్రూడాయిల్‌‌ ధరలు పెరిగితే మాత్రం గ్లోబల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరుగుతుంది. ఫలితంగా బంగారం ధరలూ ఎక్కువవుతాయి. ప్రస్తుతం మనదేశంలో ఫెస్టివల్‌‌ డిమాండ్‌‌ ఉంది కాబట్టి రేట్లు పెరగడానికి అవకాశం ఉందని మరికొందరు ఎక్స్‌‌పర్టులు అంటున్నారు. చైనాలో కరెంటు సమస్య వల్ల ఈక్విటీ మార్కెట్లు పడతాయని, ఇది ధరల పెరుగుదలకు దారితీయొచ్చని చెబుతున్నారు. తమ అంచనాలు నిజం అయితే పది గ్రాముల గోల్డ్‌‌ రూ.48 వేలపైనకు చేరుతుందని కమోడిటీ ఎక్స్‌‌పర్ట్‌‌ అమిత్‌‌ ఖారే అన్నారు.