- పాల్గొన్న బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ కేంద్ర కమిటీ సూచనల మేరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పవన్ గౌడ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీపు చంద్రదాస్ ఘటన చాలా బాధాకరమన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ద్వారక రవి, కార్యదర్శి జయరాం రెడ్డి, విశేష సంపర్క ప్రముఖ శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్: బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ, హిందూ సంఘాల నాయకులు అమీన్పూర్ పట్టణ పరిధిలోని బీరంగూడ గుట్ట కమాన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులు భారీగా పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులు దారుణమని విశ్వహిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహ కార్యదర్శి రాజారామ్ అన్నారు. మంగళవారం బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. వివిధ క్షేత్రాల నాయకులు వెంకట్, సంతోష్, రాజిరెడ్డి, మురళి పలువురు పాల్గొన్నారు.
హుస్నాబాద్ : బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న అమానవీయ దాడులను నిరసిస్తూ హుస్నాబాద్లోని భార్గవపురం మల్లె చెట్టు చౌరస్తా వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇటీవల బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని జిహాదీ మూకలు క్రూరంగా కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటనను నిరసనకారులు తీవ్రంగా ఖండించారు. బొమ్మగాని సతీష్, వొగ్గోజు వెంకటేశ్వర్లు, కర్ణకంటి నరేష్తో పాటు హిందువులు పాల్గొన్నారు.
