
GHMC లో విజయోత్సవ ర్యాలీలపై పోలీసులు నిషేధం విధించారు. రేపు(శుక్రవారం) గ్రేటర్ ఎన్నికల లెక్కింపుతో పాటు..రిజల్ట్స్ వెలువడనున్నాయి. దీంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం నుంచి 48 గంటలపాటు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ రీపోలింగ్ జరుగుతున్న ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ కేంద్రాలను సీపీ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని చెప్పారు. డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోందన్నారు. పెట్రోలింగ్, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని… లెక్కింపు కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరికీ అనుమతి ఉండదన్నారు. పర్మిషన్ లెటర్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ఎంట్రీ కల్పిస్తామన్నారు సీపీ అంజనీ కుమార్.