కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్వో)లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, రెవెన్యూ నష్టం, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు.
కార్యాలయానికి వచ్చిన డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులను గుర్తించి ప్రశ్నించారు. ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల జోక్యంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

