
ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. మరోవైపు నిర్మాతగానే కాక క్లాత్ బ్రాండింగ్, థియేటర్స్ బిజినెస్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల వాలీబాల్ టీమ్లోనూ ఇన్వెస్ట్ చేసి.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి ఏడాది అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఈసారి వందమంది లక్కీ ఫ్యాన్స్ని సెలెక్ట్ చేసి, తన సొంత ఖర్చుతో ఫ్రీ హాలీడే టూర్ కోసం కులుమనాలికి పంపాడు. వాళ్లంతా ఫ్లైట్ జర్నీలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను శుక్రవారం ట్వీట్ చేశాడు విజయ్. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో ముచ్చటించిన విజయ్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీలో విజయ్కి జంటగా సమంత నటిస్తోంది. ఇప్పటికే అరవై శాతంపైనే షూటింగ్ జరిగింది. సమంత హెల్త్ ఇష్యూస్తో షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన టీమ్, మార్చి ఫస్ట్ వీక్ నుండి తిరిగి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. విజయ్, సమంత కాంబినేషన్ సీన్స్ను ఈ షెడ్యూల్లో తీయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.